తెలంగాణలో నేడు మావోయిస్టులు బంద్కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీలో అలజడి మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కి నెత్తిటి బాకీ తీర్చుకుంటాం అన్న హెచ్చరికలు మన్యంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు పోలీసులు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ మావోయిస్టు పార్టీ ఇవాళ బంద్కు పిలుపునిస్తూ లేఖ విడుదల చేసింది. ప్రభుత్వం విప్లవకారుల్ని హత్యలు చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే ప్రతీకార చర్యతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏక్షణం ఎలాంటి చర్యలకు పాల్పడతారోనని మన్య ప్రాంతాలు వణికి పోతున్నాయి.
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ సరిహద్దు చిట్టచివరి గ్రామమైన వాజేడు మండలం టేకుల గూడెం నుండి చెరుకూరు వరకు తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే హిట్ లిస్ట్లో ఉన్న నేతలను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏ క్షణమైనా దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దు గ్రామాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. వారం రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని నేతలకు సూచించినట్టు సమాచారం. మావోయిస్టు బంద్ వేళ ఏం జరుగుతుందోని ఏజెన్సీ వాసులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు.