Today Business Headlines 09-05-23:
పెరిగిన బంగారం నిల్వలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న బంగారం నిల్వలు వృద్ధి చెందాయి. గతేడాది మార్చితో పోల్చితే 34 మెట్రిక్ టన్నులకు పైగా పెరిగి 794 మెట్రిక్ టన్నులు దాటాయి. ఇందులో 437 టన్నుల బంగారం.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సురక్షితంగా ఉంది. మిగతా 301 టన్నుల గోల్డ్ దేశీయంగా ఉంది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో పుత్తడి వాటా 2023 మార్చి చివరి నాటికి 7 పాయింట్ ఎనిమిదీ ఒకటి శాతానికి చేరింది.
‘‘యాపిల్’’లో.. నో లేఆఫ్స్
యాపిల్ కంపెనీలో లేఆఫ్లు ఇప్పట్లో ఉండకపోవచ్చని సీఈఓ టిమ్ కుక్ అన్నారు. అయితే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని కూడా చెప్పారు. మరో వైపు.. నియామకాలు సైతం చేపడతామని అన్నారు. కాకపోతే గతంలో కన్నా తక్కువ మొత్తంలో ఉద్యోగులను తీసుకుంటామని తెలిపారు. సీఈఓ టిమ్ కుక్ ప్రకటనతో యాపిల్ కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన తొలిగిపోతుందని, ఇకపై భరోసాతో పనిచేసుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు.
ఎర్లీ వార్నింగ్ ఇండికేటర్స్
ఇండియన్ ఎకానమీకి ఎర్లీ వార్నింగ్ ఇండికేటర్స్ అవసరమని ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అభిప్రాయపడింది. ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితులను నియంత్రణ సంస్థలు ముందుగానే గుర్తించి పరిష్కరించేలా ఆయా సూచికలు వ్యవహరించాలని పేర్కొంది. ఈ మేరకు ఎఫ్ఎస్డీసీ సమావేశం నిన్న సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్, సెబీ చైర్పర్సన్ మాధబి పూరి బుచ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్షన్.. 300 కోట్లు క్రాస్
పొన్నియన్ సెల్వన్-2 మూవీ కలెక్షన్లు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల మార్క్ను దాటాయి. సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఈ వసూళ్లు సాధించింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ 500 కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్, విక్రమ్, త్రిష, కార్తీక్ మరియు జయం రవి తదితరులు నటింటిన సంగతి తెలిసిందే. పార్ట్ వన్ కన్నా భిన్నంగా పార్ట్ టు తెలుగులో కూడా మంచి వసూళ్లను సొంతం చేసుకోవటం విశేషం.
వంద మందికి ఉద్యోగాలు
మ్యాట్రిమొనీ సూపర్ యాప్ అయిన్ బెటర్హాఫ్.. విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. ముఖ్యంగా లీడర్షిప్ టీమ్ని పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం 150 మంది ఉద్యోగులు ఉండగా ఆ సంఖ్యను 250కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెటింగ్, బిజినెస్ ఆపరేషన్స్, హెచ్ఆర్ మరియు ఫైనాన్స్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. వచ్చే రెండేళ్లలో నెల వారీ స్థూల ఆదాయాన్ని వంద కోట్ల రూపాయలకు పెంచుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు బెటర్హాఫ్ కోఫౌండర్ పవన్ గుప్తా చెప్పారు.
రాజస్థాన్లో.. లిథియం..
రాజస్థాన్లో భారీఎత్తున లిథియం నిల్వలను గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. నాగౌర్ జిల్లాలోని దేగాన మునిసిపాలిటీ పరిధిలో ఈ నిల్వలు ఉన్నాయని తెలిపింది. దేశానికి అవసరమైన డిమాండ్ను 80 శాతం వరకు ఈ నిల్వలు తీరుస్తాయని పేర్కొంది. దీంతో.. లిథియం కోసం ఇండియా.. చైనా పైన పెద్దగా ఆధారపడాల్సిన అవసరం ఉండబోదని వివరించింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వెహికిల్స్లో వాడే బ్యాటరీల్లో లిథియంను వినియోగిస్తారు. ఖరీదు మరియు గిరాకీ దృష్ట్యా లిథియాన్ని తెల్లబంగారం అంటుంటారు.