Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..

Ttd

Ttd

Tirumala Devotee Alert: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాయనికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగష్టు నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు మరియు సేవా టోకెన్లను ఇవాళ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో భక్తులు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించింది. టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల కానున్నాయి. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు మరియు వికలాంగుల ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేయనున్నారు.

ఇక తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో అనేక మంది భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో వేచి ఉన్నారు. టీటీడీ సమాచారం ప్రకారం టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. అందువల్ల భక్తులు తగిన విధంగా ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు.. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 87,689 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 44,476 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లకు చేరినట్లు టీటీడీ వెల్లడించింది.