Site icon NTV Telugu

Tirumala : శ్రీవారి గర్భాలయం పేరు ‘ఆనంద నిలయం’ అని ఎందుకు పిలుస్తారు? దీని వెనుక ఉన్న గూఢార్థం ఇదే!

Anandha Nilayam

Anandha Nilayam

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బంగారు కాంతులతో మెరిసిపోయే శ్రీవారి గర్భాలయ గోపురం. దీనినే ‘ఆనంద నిలయం’ అని పిలుస్తారు. అసలు ఈ పేరు వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? అక్కడ అడుగుపెట్టగానే భక్తులు ఎందుకు తన్మయత్వానికి లోనవుతారో తెలుసుకుందాం. సాధారణంగా మనం చేసే ఏ పూజలోనైనా, క్షేత్ర దర్శనంలోనైనా మన త్రికరణములు (మనస్సు, వాక్కు, కర్మ) ఒకేచోట లగ్నం కావు. గుడిలో ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది, మాటల్లో మరో విషయం ఉంటుంది. కానీ, తిరుమల ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే ఒక వింత మార్పు సంభవిస్తుంది. మన ప్రయత్నం లేకుండానే మనసులో గోవింద నామం, నోట గోవింద స్మరణ, చేసే ప్రతి చేష్ట ఆ దైవ చింతనలోనే లగ్నమవుతాయి.

చాలామంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నాక బయటకు వచ్చి.. “అయ్యో! స్వామిని ఏవేవో కోరుకుందాం అనుకున్నాను, తీరా ఆయన ముందు నిలబడగానే ఏమీ అడగకుండానే వచ్చేసాను” అని అంటుంటారు. దీనికి కారణం ఆనంద నిలయంలో లభించే ఆ పారవశ్యం. జీవాత్మ పరమాత్మను చూసినప్పుడు కలిగే ఆనందం ముందు మరే కోరికలూ నిలబడవు. అరగంట కూర్చున్నా, ఒక్క నిమిషం నిలబడినా మనసు శూన్యమై కేవలం భక్తితో నిండిపోతుంది. కలికాలంలో త్రికరణములను ఒకే దారిలో పెట్టి, జీవాత్మకు ఆ పరమాత్మ దర్శనంతో అసలైన శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే ప్రదేశం కాబట్టే, అది ‘ఆనంద నిలయం’ గా ప్రసిద్ధి చెందింది. ఆ శ్రీనివాసుడి దర్శనం కేవలం కంటికి మాత్రమే కాదు, అంతరాత్మకు కూడా పరమ ఆనందాన్ని ఇస్తుంది.

Exit mobile version