బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ యంగ్ అండ్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు టైగర్. తను హీరోగా పరిచయం అయి పదేళ్లు పూర్తి అయింది.అయితే ఈ పదేళ్లలో తను నటించిన ఒరిజినల్ కథల సినిమాలకంటే రీమేక్సే ఎక్కువ. అలా రీమేక్స్ తోనే ‘బాఘీ’ అనే ఒక మూవీ ఫ్రాంచైజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్లో నాలుగో సినిమా రానుందని టైగర్ అనౌన్స్ చేయగా ఈసారి ఏ సౌత్ సినిమా బలైపోతుందో అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.‘హీరోపంతి’ అనే సినిమాతో టైగర్ ష్రాఫ్ హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇది ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ అయిన ‘పరుగు’ సినిమా రీమేక్. ఇందులో హీరోగా అల్లు అర్జున్ చేసిన పాత్రను రీమేక్లో టైగర్ ష్రాఫ్ నటించాడు. హీరోయిన్ గా కృతి సనన్ నటించింది.. ఆ తర్వాత ‘బాఘీ’ అనే చిత్రంతో ఆడియన్స్ ని పలకరించాడు. అది తెలుగులో ప్రభాస్, త్రిష నటించిన ‘వర్షం’ చిత్రానికి రీమేక్.
ఆ తర్వాత తను కొన్ని ఒరిజినల్ చిత్రాల్లో నటించినా కూడా అవి తనకు అంతగా హిట్ అందించలేకపోయాయి.దీంతో మరోసారి అడవి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ అనే థ్రిల్లర్ మూవీని ‘బాఘీ 2’ పేరుతో రీమేక్ చేశాడు టైగర్. ఇలా వరుస రీమేక్స్ తోనే ఈ హీరో హిట్స్ అందుకున్నాడు.2020లో ‘బాఘీ’ ఫ్రాంచైజ్ నుండి చివరి మూవీ రిలీజ్ అయ్యింది. అదే ‘బాఘీ 3’. ఇది కూడా ఒక సౌత్ సినిమాకు రీమేకే. తమిళంలో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘వెట్టాయ్’ చిత్రాన్ని ‘తడాఖా’ పేరుతో నాగచైతన్య, సునీల్.. తెలుగులో రీమేక్ చేశారు. అదే సినిమాను ‘బాఘీ 3’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు టైగర్ ష్రాఫ్. అలా ‘బాఘీ’ ఫ్రాంచైజ్లో ఇప్పటివరకు విడుదలయిన సినిమాలన్నీ రీమేక్ లే కావడం విశేషం.అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుండి నాలుగో చిత్రం రానుందని టైగర్ ష్రాఫ్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. అంతే కాకుండా ‘బాఘీ 4’ 2025లో విడుదల అవుతుందని కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఈ మూవీకి రీమేక్ అయ్యింటుంది అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.