CM Chandrababu: కర్ణాటకలో జరిగిన తుంగభద్ర డ్యామ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగభద్ర నది తల్లికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని పేర్కొన్న ఆయన, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలవడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ సమావేశం మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. తుంగభద్ర డ్యామ్కు 75 సంవత్సరాల ఘన చరిత్ర ఉందని గుర్తు చేసిన చంద్రబాబు, ఈ ప్రాజెక్ట్ దశాబ్దాలుగా కోట్లాది ప్రజల జీవితాలకు ఆధారంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు గత 70 ఏళ్లుగా తాగునీరు, సాగునీటిని అందిస్తూ తుంగభద్ర డ్యామ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
గతంలో తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు సీఎం చంద్రబాబు… అప్పటి కర్ణాటక సాగునీటి శాఖ మంత్రి డీకే సుకుమార్ చొరవతో సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాల వంటివని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు అన్నారు. తుంగభద్ర డ్యామ్ భద్రత, సామర్థ్యాన్ని పెంచే దిశగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 33 గేట్లను ఏర్పాటు చేసి డ్యామ్కు కొత్త శోభ తీసుకొచ్చామని పేర్కొన్నారు. నీటి వనరుల పరిరక్షణ, రాష్ట్రాల మధ్య సమన్వయం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యంత అవసరమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తుంగభద్ర డ్యామ్ పునరుద్ధరణ కార్యక్రమం మూడు రాష్ట్రాల మధ్య సహకారానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

