NTV Telugu Site icon

Team India: న్యూజిలాండ్‌తో జరిగే రెండు, మూడో టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు ఇదే..

Team India Test

Team India Test

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కివీస్‌తో జరిగే రెండో, మూడో టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించింది. ఇందులో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించింది. రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున ఆడుతున్న వాషింగ్టన్ పుణెలో జట్టుతో చేరనున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి పుణెలో జరగనుంది.

అయితే, టీమ్‌లో ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. అయినప్పటికీ.. బీసీసీఐ వాషింగ్టన్‌ను ఎందుకు జట్టులోకి తీసుకున్నారనే దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే.. టీమిండియా ఇప్పుడు 16 మంది సభ్యులతో కూడిన జట్టుతో పూణె, ముంబైకి వెళ్లనుంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల తర్వాత కివీస్ జట్టు భారత్‌లో సాధించిన తొలి టెస్టు విజయం ఇది.

Read Also: Crime : ప్రియుడికి చేయి కోసుకున్న వీడియో పంపిన యువతి, చూసి గుండెపోటుతో ప్రియుడి మృతి

రంజీ ట్రోఫీ సీజన్‌ను వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ప్రారంభించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీపై మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి 152 పరుగులు చేశాడు. దీంతో పాటు వాషింగ్టన్ రెండు వికెట్లు కూడా తీశాడు. వాషింగ్టన్ చివరిసారిగా 2021 మార్చిలో అహ్మదాబాద్‌లో భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

న్యూజిలాండ్‌తో జరిగే రెండు, మూడో టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్.