ఏడాదిన్నరగా నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ యజమానిని బురిడీ కొట్టించి 40 లక్షల నగదు, కారుతో పరారయ్యాడు. పెళ్లి చేసుకొని కొట్టేసిన నగదుతో బిజినెస్ చేసి సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని , మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. పెళ్లి పీటలు ఎక్కబోయే ఆ డ్రైవర్ ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసుకు సంబంధించి… పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావులు వివరాలు వెల్లడించారు. అత్తాపూర్ కు చెందిన వినయ్ కుమార్ గుప్త స్టీల్ వ్యాపారం నిర్వహించేవారు. అతని వద్ద రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన విజేంద్ర సింగ్ ఏడాదిన్నర క్రితం కారు డ్రైవర్ గా పనిలో చేరాడు. నమ్మకంగా పని చేస్తూ వారి ఇంటి మనిషిలాగా మెలిగాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న వినయ్ కుమార్ గుప్త రామంతపూర్ వెళ్తుండగా… దాహం వేయడంతో హైదర్ గూడ నిలోఫర్ కేఫ్ వద్ద కారు ఆపి , వాటర్ బాటిల్ కొనేందుకు లోనికి వెళ్ళాడు. వాటర్ బాటిల్ తీసుకువచ్చేసరికి డ్రైవర్ , కారు కనిపించకపోవడంతో కంగుతిన్న వినయ్ కుమార్ డ్రైవర్ విజేంద్ర సింగ్ నెంబర్ కు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో… నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కారు తో పాటు కారులో ఉన్న 40 లక్షల నగదు ఎత్తికెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదు తో ప్రత్యేక టీమ్ తో హైదరాబాద్ , రాజస్తాన్ రాష్ట్రంలో గాలించారు. రాజస్తాన్ లో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా మొదటగా డబ్బులన్ని ఖర్చు అయ్యాయని , ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులన్ని పోగొట్టుకున్నానని బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా… అసలు విషయం బయట పెట్టాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు… దొంగిలించిన డబ్బుతో 11 లక్షలు పెట్టి మహేంద్ర స్కార్పియో కారు కొన్నట్లు , మిగిలిన నగదుతో బిజినెస్ పెట్టి సెటిల్ అవ్వాలని అనుకున్నట్లు తెలిపాడు. విజేంద్ర సింగ్ వద్ద నుండి 20 లక్షల 70 వేల నగదు , 11 లక్షలు విలువ చేసే స్కార్పియో కారు , ఓనర్ వినయ్ కుమార్ కీయ సెల్టోస్ కారు తో పాటు రెండు మొబైల్ ఫోన్ల ను సీజ్ చేశారు. మిగిలిన డబ్బుతో ఇన్నిరోజులు విలసవంతంగా గడిపినట్లు ఒప్పుకున్నట్లు డిసిపి తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి , న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.