NTV Telugu Site icon

TGS RTC: ఆర్టీసీ అదరహో.. రక్షాబంధన్ వేళ లక్షల మంది సోదరీమణులకు అండగా సేవలు!

Tgs Rtc

Tgs Rtc

రాఖీ ఆప‌రేషన్స్, మెరుగైన ప‌నితీరుపై త‌మ క్షేత్రస్థాయి అధికారుల‌తో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజ‌మాన్యం ప్రత్యేకంగా స‌మావేశ‌మైంది. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి వ‌ర్చ్‌వ‌ల్‌గా బుధ‌వారం జ‌రిగిన ఈ స‌మావేశంలో ఉన్నతాధికారుల‌తో క‌లిసి సంస్థ ఎండీ వీసీ స‌జ్జన‌ర్ పాల్గొన్నారు. రాఖీ పండుగ ఆప‌రేష‌న్స్‌లో సిబ్బంది ప‌నితీరు, అనుభ‌వాలతో పాటు భ‌విష్యత్‌లో తీసుకోవాల్సిన చ‌ర్యల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చ‌ర్చించారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు.

READ MORE: Cyber ​​crime: అలర్ట్.. పాడైన ఫోన్లు అమ్ముతున్నారా.. చిక్కుల్లో పడ్డట్లే!

ఈ స‌మావేశంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జన‌ర్ మాట్లాడుతూ.. రాఖీ పండుగ సంద‌ర్భంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప‌నిచేశార‌ని కొనియాడారు. భారీ వ‌ర్షాల్లోనూ నిబ‌ద్ధత, అంకిత‌భావం, క్రమ‌శిక్షణ‌తో ప‌నిచేశార‌ని ప్రశంసించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో రికార్డుస్థాయిలో 1.74 కోట్ల మందిని క్షేమంగా గ‌మ్యస్థానాల‌కు సంస్థ చేర‌వేసింద‌ని తెలిపారు. వ‌రుస‌గా మూడు రోజులు సంస్థలో 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) న‌మోదైంద‌ని వెల్లడించారు. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా రాఖీ ఒక్క రోజే 63 ల‌క్షల మంది త‌మ బ‌స్సుల్లో రాకపోక‌లు సాగించార‌ని గుర్తు చేశారు. మూడు రోజుల్లో 1.07 కోట్ల కిలోమీట‌ర్ల మేర ఆర్టీసీ బ‌స్సులు తిరిగాయ‌ని పేర్కొన్నారు. గ‌త ఏడాది రాఖీ పౌర్ణమి నాడు 21 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) న‌మోదు చేయ‌గా.. ఈ సారి 97 డిపోలు ఆ మైలురాయిని దాటాయ‌ని తెలిపారు. ఈ రాఖీ పండుగ టీజీఎస్ఆర్టీసీ రికార్డుల‌న్నింటినీ తిర‌గ‌రాసింద‌ని తెలిపారు.

READ MORE:T-Safe: అమ్మాయిలూ.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా?

అత్యధిక ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్‌) న‌మోదు చేసిన మ‌హ‌బుబ్‌న‌గ‌ర్, న‌ల్లగొండ‌, మెద‌క్, వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ రీజియ‌న్ల ఆర్ఎంల‌ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, గ‌జ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, దుబ్బాక‌, క‌ల్వకుర్తి, ముషీరాబాద్, దేవ‌ర‌కొండ‌, తొర్రూర్, నార్కెట్‌ప‌ల్లి, షాద్‌న‌గ‌ర్ డిపోలు అత్యధిక ఓఆర్‌ను న‌మోదు చేశాయ‌ని, ఆయా డీఎంల‌కు, సిబ్బందికి అభినంద‌న‌లు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి నాడు విధుల్లో నిర్వర్తిస్తున్న సిబ్బందికి మ‌ధ్యాహ్న భోజ‌నం అందించాల‌ని నిర్ణయం తీసుకున్న సంస్థ ఎండీ వీసీ స‌జ్జన‌ర్‌ను ఈ సంద‌ర్భంగా అధికారులు అభినందించారు. భోజ‌నం అందించ‌డం వ‌ల్ల ఎలాంటి ఆల‌స్యం లేకుండా ఆప‌రేష‌న్స్ స‌జావుగా జ‌రిగాయ‌ని, కొంద‌రు డ్రైవ‌ర్లు బ‌స్సు స్టీరింగ్ పై కూర్చుని భోజ‌నం చేసి.. వృత్తి ప‌ట్ల త‌మ నిబ‌ద్ధత‌ను చాటుకున్నార‌ని యాజ‌మాన్యం దృష్టికి తీసుకువ‌చ్చారు. అధికారులు, సిబ్బంది ప‌నిత‌నాన్ని యాజ‌మాన్యం గుర్తిస్తుంద‌ని, రాఖీ పౌర్ణమి ఆప‌రేష‌న్స్‌లో మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రిచిన వారికి త్వర‌లోనే రివార్డుల‌ను అంద‌జేస్తుంద‌ని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీని ఆద‌రిస్తూ.. వెన్నుద‌న్నుగా నిలుస్తోన్న ప్రయాణికులంద‌రికీ ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు.

READ MORE:Maharaja: బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజా మాస్ రికార్డ్..!

ఈ స‌మావేశంలో సీవోవో డాక్టర్ రవిందర్, జేడీ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, ఫైనాన్స్ అడ్వైజ‌ర్ విజ‌య‌పుష్ఫ, వివిధ విభాగాల హెచ్‌వోడీలు శ్రీదేవి, శ్రీధ‌ర్, వెంక‌న్న, సుధాప‌రిమ‌ళ, విజ‌య‌భాస్కర్, డిప్యూటీ సీటీఎం జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. వ‌ర్చ్‌వ‌ల్‌గా హైద‌రాబాద్ అండ్ క‌రీంన‌గ‌ర్ జోన్ ఈడీ వినోద్ కుమార్, గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ ఈడీ వెంక‌టేశ్వర్లుతో పాటు ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు హాజ‌ర‌య్యారు.