Telangana Monsoon : తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రాన్ని తాకాయి. తాజాగా వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. రుతుపవనాలు జోగులాంబ గద్వాల జిల్లా ద్వారా తెలంగాణలోకి అధికారికంగా ప్రవేశించాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణం చల్లబడటమే కాకుండా, రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి మరింత బలోపేతం కానున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ అంతటా రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రుతుపవనాల రాకతో ముఖ్యంగా దక్షిణ , తూర్పు తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు, అలాగే సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు ఈ రుతుపవనాల ప్రవేశం ఎంతో ఉపశమనాన్ని , సంతోషాన్ని కలిగిస్తోంది.

