తెలంగాణ అన్నదాతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తీపి కబురు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు పనుల్లో నిమగ్నమైన రైతన్నలకు అండగా నిలుస్తూ, రైతు భరోసా నిధులను నేడు విడుదల చేశారు. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఇంకా ఈ పథకం పరిధిలోకి రాని రైతుల కోసం ప్రభుత్వం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. ఇప్పటివరకు రైతు భరోసా నిధులు పొందని వారు, లేదా బ్యాంక్ వివరాల్లో తప్పులు ఉన్నవారు మార్చి 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఫిబ్రవరి 28, 2026 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.
అర్హులైన రైతులు తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణాధికారిని (AEO) కలిసి దరఖాస్తు ఫారమ్ సమర్పించాలి. దరఖాస్తుతో పాటు కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలను జత చేయాలి. రైతులు సమర్పించే బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా కేవైసీ (KYC) పూర్తి చేసి ఉండాలి. ఆధార్ సీడింగ్ లేకపోతే డబ్బులు జమ కావడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు కాబట్టి, వెంటనే మీ పరిధిలోని రైతు వేదికలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి. సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న సన్నకారు రైతులకు ఈ నిధులు ఎంతో ఊరటనివ్వనున్నాయి.