Telangana Rising Summit 2025: రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ఈరోజు (డిసెంబర్ 8) మధ్యాహ్నం 1.30కు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12.30కు ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. 1:30 కు వేడుక ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశమవుతారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం కలుసుకుంటారు. ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్. ఐకియా ప్రతినిధులు, టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ MSME, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ రంగ ప్రతినిధులు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు, వంతార, VinGroup ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు..