Telangana Rains: వినాయకచవితి నాడు వరుణుడు కరుణించాడు. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వర్షాలు లేక అలమటించి పోతున్న రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక, ఇటు రాజధాని హైదరాబాద్లోనూ వరుణుడు ప్రతాపం చూయిస్తున్నాడు. నగరంలోని కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్పల్లి, మియాపూర్, అంబర్పేట్, గచ్చిబౌలిలో వర్షం కుమ్మేస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. సిటీలోని లోతట్టు ప్రాంతాలు, పలు ప్రాంతాల్లో రహదారులు జలమయ్యాయి. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తు్న్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించండి..
ఇక, వర్ష వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, కొన్ని చిన్నపాటి నిర్లక్ష్యాలు అనారోగ్యానికి దారితీస్తాయి. అందుకే ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. వర్షంలో తడవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ గొడుగు లేదా రెయిన్కోట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. తడిసిన దుస్తులలో ఎక్కువ సేపు ఉండకుండా, వెంటనే పొడి దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఈ కాలంలో కలుషిత నీటి ద్వారా రోగాలు వేగంగా వ్యాపిస్తాయి, కాబట్టి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. రోడ్డు పక్కన అమ్మే బహిరంగ ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. ఇంట్లో వండిన వేడివేడి, సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. విద్యుత్ ప్రమాదాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై ఉండే వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ స్తంభాలు, తడిసిన గోడలను అస్సలు తాకకూడదు. ఇంట్లో విద్యుత్ పరికరాలను వాడేటప్పుడు చేతులు పొడిగా ఉండేలా చూసుకోవాలి. వాహనాలు నడిపేవారు రోడ్లపై ఉండే నీటి గుంతల పట్ల జాగ్రత్తగా ఉంటూ, వేగాన్ని తగ్గించి వెళ్లడం సురక్షితం. అలాగే పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

