CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకోం.. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ భరోసా..

Ccm Revanth

Ccm Revanth

CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కించే విషయంలో వెనకబడేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గోల్కొండ కోటలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు మనందరికీ పరమోత్సవమని, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని పేర్కొన్నారు. ఎందరో మహానీయుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యమని, ఆ త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ మహానీయులందరికీ వినమ్రంగా తలవంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వాతంత్ర్య పోరాటమని, అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చని లోకానికి చాటిచెప్పిన ఘనత భారతదేశానిదని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలబడటానికి ప్రథమ ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారని, దేశం ఆధునిక భారత్‌గా అవతరించడానికి అవసరమైన ప్రాథమిక రంగాలు, పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు.

విధ్వంసమైన తెలంగాణ రూపురేఖలను మళ్లీ నిర్మించి వికసింపజేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛను అందించిందని, రాష్ట్రంలో ప్రతి రంగంలో అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా సరిచేసి నిలబెట్టామని తెలిపారు. సంక్షేమాన్ని విస్తరిస్తూ, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తూ భవిష్యత్తు అవసరమైన కార్యాచరణకు పునాదులు వేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి సంక్షేమమంటే ఆర్థిక భారం కాదని, ఖర్చు పెట్టిన రూపాయిలకు లెక్క కట్టడం కాదని, సంక్షేమ ఆలోచనలో మానవీయత, బాధ్యత, ప్రజల్లో ఆనందం నింపాలనే తపన, ఆరోగ్యవంతమైన ప్రజలను అందించే ప్రయత్నం, ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పం ఉన్నాయని వివరించారు. ఓట్ల కోసం, రాజకీయం చేయడం కోసం సంక్షేమాన్ని చూడటం లేదని, ప్రతి పథకంలో సామాజిక దృక్పథం ఉందన్నారు. ఈ 32 నెలల కృషి ఫలితాలను ఇస్తోందని, ఆర్‌బిఐ నివేదిక ప్రకారం 2025-26లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931గా ఉంటూ దేశ తలసరి ఆదాయంతో పోల్చితే దాదాపు 91 శాతం అధికంగా ఉందని, ఇది ఆర్థిక వ్యవస్థ బలానికి తిరుగులేని విజమని పేర్కొన్నారు.

రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల కన్నీళ్లు తుడిచి వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసి 25 లక్షల మందికి పైగా రైతు కుటుంబాలకు రుణ విముక్తి చేశామని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా సాయం అందించామని గుర్తుచేశారు. గత రెండు రోజులలోనే దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేశామని, సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి అండగా నిలిచామని చెప్పారు. గతించిన 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.70 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని, వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ పంజాబ్‌ను దాటి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కొత్త రికార్డు నెలకొల్పామని, గత వానకాలంలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కించే విషయంలో వెనకబడేది లేదని, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, తెలంగాణలో ప్రతి ఇంట ఆడబిడ్డలను మహాలక్ష్ములు చేయడమే లక్ష్యమని సీఎం వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇప్పటికే 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, రోజుకు 34 లక్షలకు పైగా మహిళలు ఈ సదుపాయాన్ని వాడుకుంటూ రూ.11 కోట్లకు పైగా ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. గృహజ్యోతి ద్వారా 53.09 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ 10.97 కోట్ల సున్నా బిల్లులు జారీ చేశామని, 42.90 లక్షల కుటుంబాలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు సాయం అందించేందుకు రూ.4,709 కోట్లు ఖర్చు చేశామన్నారు. స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60,487 కోట్ల రుణాలు అందించామని, వడ్డీలేని రుణాల కింద రూ.1,900 కోట్ల వడ్డీని విడుదల చేశామని తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, మహిళలు పాఠశాల యూనిఫాంలు కుడుతూ, సోలార్ పంపులు, మహిళా విద్యుత్ బస్సులను నిర్వహిస్తూ ఆర్టీసీ బస్సులకు యజమానులుగా ఉన్నారని కొనియాడారు.