Joinings in BRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ పక్కనున్న ఏపీలో బీఆర్ఎస్ పాత్రపై రకరకాల ఉహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీలోని ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీలోని ముగ్గురు కీలక నేతలు రేపు బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్ , పార్థసారథి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేపు మధ్యాహ్నం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
వారు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ విస్తరణపై చాలా సీరియస్గా పని చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఫుల్ ఫోకస్తో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రాలో బీఆర్ఎస్అధ్యక్షుడిగా కీలక నాయకుడిని నియమించబోతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ పరిశీలనలో ఉన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం పార్టీలో చేరనున్నారు తోట చంద్రశేఖర్. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి తెలంగాణ భవన్లో చేరికలు ఉండనున్నాయి. మాజీ మంత్రి రావెల కిశోర్ కూడా బీఆర్ఎస్లో చేరునున్నట్లు తెలుస్తుంది. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా- ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును ఎఫెక్ట్ చేసేలా కేసీఆర్ వ్యూహం రచించారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడ్ని చేస్తే కాపుల్లో కొందరు బీఆర్ఎస్ వైపునకు ఆకర్షితులవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
PV Chalapathi Rao Passes Away: బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతి రావు కన్నుమూత
తోట చంద్రశేఖర్ ఇదివరకు వైసీపీలో పని చేశారు. 2014లో ఏలూరు లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జనసేనలో చేరి.. యాక్టివ్గా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి పవన్ సన్నిహితుల్లో ఒకరిగా మెలుగుతున్నారు. 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినా.. ఫలితం దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమించనున్నారు. రేపు తోట చంద్రశేఖర్ కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నారు. అనంతరం ఆయనను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నాయి. తోట చంద్రశేఖర్ ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. ఆయనతో పాటు కొందరు కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ లో చేరనున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికే తోట చంద్రశేఖర్ పార్టీలో చేరుతున్నట్లు తెలిసింది.
ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అద్దె భవనాన్ని కూడా కేసీఆర్ ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. ఈ వ్యవహారాలు అన్నీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూసుకుంటున్నారు.