Deputy CM Bhatti Vikramarka Said Loan Waiver will be completed soon in Telangana: 2024-25 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు.
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని ఆపలేదు. డిసెంబర్ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నాం. గతంలో పేపర్ లీకులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Also Read: Pranitha Subhash Pregnancy: రౌండ్ 2.. రెండేళ్లకే! తల్లి కాబోతున్న హీరోయిన్ ప్రణీత
‘రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు సమీకరిస్తున్నాం. త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం. లక్ష వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతులకు రుణమాఫీ చేశాం. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ అవుతుంది. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం. త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల అందిస్తాం. రైతులు పండించే వరి సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తాం. ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరబోతున్నాం. మొత్తం వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని భట్టి చెప్పారు.