NTV Telugu Site icon

Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదు.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

Kishan

Kishan

Kishan Reddy: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చుతారనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. బండి సంజయ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండటం, బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అధ్యక్షుడి మార్పు అంశం తెరపైకి వచ్చింది. బండి సంజయ్‌ స్థానంలో కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదని, అలాంటి ఆలోచన హైకమాండ్ కు లేదని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్‌ను మార్చుతారంటూ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమేనని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకే కొంతమంది ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని.. అసలు ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదని కిషన్ రెడ్డి తెలిపారు.

Read Also: Sruthi Hasan: మరోసారి పబ్లిక్ లో ఆ పనిచేసిన శృతి హాసన్?

మరోవైపు అధ్యక్షుడి మార్పు అంటూ వస్తున్న ఊహాగానాలపై బండి సంజయ్ కూడా స్పందించారు. అదంతా మీడియా సృష్టేనని, దానిని తమ కార్యకర్తలు కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు. అధ్యక్షుడి మార్పు ఉంటుందా..? లేదా? అనేది జేపీ నడ్డాను అడిగి చెబుతానని అన్నారు. తమ పార్టీలోని కొంతమంది నేతలే కావాలని మీడియాకు లీకులు ఇస్తూ గందరగోళం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని, వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.

Read Also: Pakistan: ఈద్ ప్రార్థనల సమయంలో జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..

అటు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కూడా అధ్యక్షుడి మార్పు వార్తలపై ఫైర్ అయ్యారు. కొంతమంది కావాలని పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బండి సంజయ్‌ ఎన్నికల వరకు కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడి మార్పు అంశం అధిష్టానం దృష్టిలో లేదని, ప్రతిసారి ఇలా ప్రచారం చేయడం సరికాదని మీడియాకు సూచించారు. కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తారని, బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారనే వార్తలు బుధవారం మీడియాలో వినిపించాయి. ఈటల రాజేందర్‌కు ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించనున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, తరుణ్ చుగ్ కూడా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.