Telangana BJP Incharge Sunil Bansal Meeting at Munugodu
బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు కమలనాథులు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ను తెలంగాణ బీజేపీ ఇంచార్జీగా నియమించింది బీజేపీ అధిష్టానం. అయితే.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. మనుగోడు సైతం కాషాయ జెండా ఎగురవేసి తెలంగాణ బీజేపీ బలాన్ని మరింత పెంచి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీగా ప్రజల ముందు అవతరించేందుకు కసరత్తు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే తాజాగా నల్లగొండ జిల్లా మునుగోడులో బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సునీల్ బన్సల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు లో తొలిసారిగా అడుగు పెట్టానన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం అనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో గొప్ప మార్పు రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. అందుకు ప్రతి ఒక్క కార్యకర్తలు కృషి చేయాలని.. బీజేపీ పార్టీ బలోపేతానికి పాటుపడాలన్నారు.