తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇక, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించిందన్నారు. ప్రగతిభవన్ను.. ప్రజాభవన్గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఆమె చెప్పుకొచ్చారు. అర్హులైన వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అములుకు కట్టుబడి ఉన్నాం.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు.. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని గవర్నర్ తమిళిసై వెల్లడించారు.
Read Also: AP Assembly budget Session: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. బహిష్కరించిన టీడీపీ
అలాగే, మూసీ నదిని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తామని గవర్నరత్ తమిళిసై పేర్కొన్నారు. దేశానికి హైదరాబాద్ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొత్తగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం.. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ రూపొందించాం.. వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజీలు.. మూసీ నది ప్రక్షాళనలకు ప్రణాళిక రూపొందించామని గవర్నర్ పేర్కొన్నారు. ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్గా హుస్సేన్సాగర్, లక్నవరం చెరువులను అభివృద్ది చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకు వస్తామని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఇక, గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశలు రేపటికి వాయిదా పడ్డాయి. దీంతో రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగనుండగా.. ఈ నెల 10వ తారీఖున తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు.
