Telangana Assembly Session 2026: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ప్రశ్నోత్తరాలతో శాసనసభ, మండలి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభమైన తర్వాత పలు కీలక నివేదికలను సభ ముందుకు తీసుకురానున్నారు. తొలిరోజు ‘తెలంగాణ సమగ్ర శిక్షణ’, ‘పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా’, మెట్రో రైలుకు సంబంధించిన ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడే అవకాశముంది.
ఈసారి అసెంబ్లీ సమావేశాలు సుమారు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. చర్చించాల్సిన అంశాల ప్రాధాన్యాన్ని బట్టి సమావేశాల గడువును మరింత పొడిగించే అవకాశమూ ఉంది. సభ నిర్వహణ, పని దినాలు, చర్చించాల్సిన అంశాలు, అజెండాపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో చర్చించనున్నారు. సభలో ఏ అంశాలకు ఎంత సమయం కేటాయించాలనే దానిపై కూడా BACలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. తన ప్రభుత్వం సాధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించేందుకు అధికారపక్షం సిద్ధమవుతోంది. వివిధ శాఖల పనితీరు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అంశాల వారీగా ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ప్రధాన అజెండాగా ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ హామీలు, అమలు తీరు, ప్రజా సమస్యలపై అధికారపక్షాన్ని నిలదీసే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల జాబితాలో సుమారు 20 అంశాలను చేర్చాలని బీఆర్ఎస్ బీఏసీ సమావేశంలో కోరనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సమావేశాలను కేవలం కొన్ని రోజులకు పరిమితం చేయకుండా నెల రోజుల పాటు నిర్వహించాలనే డిమాండ్ను కూడా ఆ పార్టీ ముందుకు తీసుకురానుంది. సభ ప్రారంభానికి ముందు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వెళ్లనున్నారు.
ఈసారి కూడా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గైర్హాజరీలో బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో ఎవరు ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి రాజకీయంగా వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ తన వెయ్యి రోజుల పాలనను సమర్థించుకునేందుకు సిద్ధమవుతుండగా.. బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో సభలో కీలక అంశాలపై తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉంది.

