తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి మాన్ సుఖ్ మాండవీయ కి లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని… రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందని… కాబట్టి ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి ఎరువులు కేటాయించాలని కోరారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ వెసెల్ నుండి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని… కాకినాడ, విశాఖ పోర్టులలో ఉన్న ఆర్ సీ ఎఫ్, ఛంబల్, ఐపీఎల్ ఫర్టిలైజర్స్ కు చెందిన వెసెల్స్ నుండి 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలని డిమాండ్ చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. క్రిబ్ కో కంపెనీ నుండి రెండు అదనపు రేక్ లు యూరియా కేటాయించాలని.. అక్టోబర్, నవంబర్ నెలలలో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుండి మార్చి సరఫరాలో భర్తీ చేయాలని కోరారు.