Tejashwi Yadav: ఇది అద్భుత విజయం.. బీహార్‌లో నేరాలపై తేజస్వీ తీవ్ర విమర్శలు

  • బీహార్‌లో నేరాలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు
  • ప్రధాని మోడీ.. సీఎం నితీష్‌లపై మండిపాటు
Tejashwi Yadav

Tejashwi Yadav

Tejashwi Yadav: బీహార్‌లో పెరుగుతున్న నేరాలపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లపై మండిపడ్డారు. నేరాల పెరుగుదలపై బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. గత మూణ్ణాలుగు రోజుల్లో రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలతో సహా 41 నేరాలు చోటుచేసుకున్నాయని తన ట్విట్టర్‌ పోస్ట్‌లో వెల్లడించారు. వాటిని బీహార్‌ ప్రభుత్వంలో అద్భుతమైన, ప్రయోజనకరమైన విజయాలు అని ఆయన ఎద్దేవా చేశారు.

Read Also: Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అరెస్ట్

మంగళవారం పాట్నాలోని ఓ ఇంటి వెలుపల నాలుగేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన తర్వాత ఆర్జేడీ నాయకుడు స్పందించారు. బాలిక తన కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఆ బాలిక తండ్రి హరి ఓం కుమార్ రాత్రి పొద్దుపోయేసరికి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది. కుమార్ ఇంట్లోకి రాగానే తలుపు దగ్గర అతని కూతురు ఉంది. ఆయన తన బైక్‌ పార్క్ చేస్తుండగా.. అతని భార్య కిరాణా సామాను లోపల పెట్టేందుకు వెళ్లగా.. అమ్మాయి బయట నిలబడి ఉంది. తుపాకీ శబ్దం వినిపించడంతో దంపతులు బయటకు పరుగెత్తగా, తమ కుమార్తె రక్తపు మడుగులో పడి ఉంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించిన తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన తర్వాత ఆర్జేడీ నేత ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. 3-4 రోజుల్లోనే 41 నేరాలు జరిగాయని.. అవి ఎక్కడెక్కడ జరిగాయో వివరాలతో సహా వెల్లడించారు. బీహార్‌లో ఈ తరహాలో పాలన జరుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.