Team India: ఐపీఎల్ సీజన్ మొత్తం ఫిట్‌.. టీమిండియాలోకి రాగానే గాయాలు.. బీసీసీఐకి కొత్త తలనొప్పి!

Team India

Team India

Team India Injury Crisis: భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఆటగాళ్లు వరుసగా గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ 2026లో తమ తమ ఫ్రాంచైజీల తరఫున నిలకడగా ఆడిన జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి ఇప్పుడు ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు జాతీయ జట్టుకు దూరం కాగా, మరికొందరు పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే (జూలై 16)లో ఫీల్డింగ్ చేస్తుండగా బుమ్రా ఎడమ మోకాలకి గాయమైంది. దీంతో అతడిని మూడో వన్డే నుంచి తప్పించి, వైద్యుల సలహా మేరకు ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రాథమిక స్కాన్‌లో ‘లెఫ్ట్ నీ సోర్‌నెస్’ (ఎడమ మోకాలి నొప్పి) ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అతడిని బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE)కి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లోపు బుమ్రా కోలుకుంటాడని టీమిండియా వర్గాలు భావిస్తున్నప్పటికీ, అది పూర్తిస్థాయి ఫిట్‌నెస్ టెస్ట్ ఉత్తీర్ణతపైనే ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం గాయాలు, ఫిట్‌నెస్ కారణంగా దూరమైన ప్లేయర్స్..

జస్ప్రీత్ బుమ్రా: మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.
హార్దిక్ పాండ్యా: ఫిట్‌నెస్ లేక జట్టుకు దూరమయ్యాడు.
నితీష్ కుమార్ రెడ్డి: గాయం వల్ల మైదానానికి దూరమయ్యాడు.
వరుణ్ చక్రవర్తి: పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేడు.

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే అంతర్జాతీయ మ్యాచ్‌లు మొదలవ్వడం, సరిగ్గా అదే సమయంలో ఈ నలుగురు కీలక ఆటగాళ్లు గాయపడటం చర్చనీయాంశమైంది. అయితే.. వీటన్నిటికీ కేవలం ఐపీఎల్ మాత్రమే కారణమని చెప్పలేం. బుమ్రాకు అంతర్జాతీయ మ్యాచ్‌లోనే గాయమైంది. కానీ, ఐపీఎల్ తర్వాత వెంటనే ఎలాంటి విరామం లేకుండా ఆడుతుండటం వల్ల ఆటగాళ్ల శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందనేది జగమేరిగిన సత్యం. ఇక, ఒకప్పుడు ఆటగాళ్లు ఏడాదికి పరిమిత సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేవారు. కానీ ఇప్పుడు ఐపీఎల్, అంతర్జాతీయ సిరీస్‌లు, ఐసీసీ టోర్నమెంట్లు, దేశవాళీ లీగ్‌లు, నిరంతర ప్రయాణాలతో క్యాలెండర్ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా 140-145 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే బుమ్రా లాంటి పేసర్ల కాళ్లు, వీపుపై పడే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రికవరీకి తగినంత సమయం దొరకడం లేదు.

వ్యవస్థతోనే అసలైన పోరాటం

గాయాలు క్రీడల్లో సహజమే కాబట్టి, ఆటగాళ్లకు దేశం తరఫున ఆడే కసి తగ్గిందని ఆరోపించడం సరికాదు. ప్రపంచకప్ 2027, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) వంటి పెద్ద టోర్నీలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ పక్కా ‘వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్’ పాలసీని రూపొందించాల్సి ఉంది. చిన్న చిన్న ద్వైపాక్షిక సిరీస్‌లలో స్టార్ ప్లేయర్లకు విశ్రాంతినిస్తూ, పెద్ద టోర్నీలకు సిద్ధం చేయడమే ఇప్పుడు భారత క్రికెట్ ముందున్న అతిపెద్ద సవాలు.