Team India: భారత క్రికెట్ జట్టులో అంతర్గతంగా ముదురుతున్న విభేదాలు, అస్పష్టతలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఏడాది (2027) జరగబోయే వన్డే ప్రపంచ కప్ ప్రిపరేషన్స్లో భాగంగా టీం ఇండియా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో తలపడటానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ 50 ఓవర్ల సిరీస్ ప్రారంభానికి ముందే డ్రెస్సింగ్ రూమ్లో పరిస్థితులు సరిగ్గా లేవనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా టెస్టులు, టీ20 ఫార్మాట్లలో పూర్తి పట్టు సాధించిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వన్డేల విషయానికి వచ్చేసరికి ఇంకా ఆ స్థాయి పట్టును ప్రదర్శించలేకపోతున్నారని తెలుస్తోంది. దీనికి తోడు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై నిరంతరం సాగుతున్న చర్చలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి.
తాజా సమాచారం ప్రకారం.. జట్టులోని కొందరు ‘సీనియర్ ప్లేయర్లు’ కోచ్ గౌతమ్ గంభీర్ను పక్కనబెట్టి, నేరుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అగ్రనేతలను సంప్రదించినట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచ కప్లో తమ భవిష్యత్తు, ప్రణాళికలపై స్పష్టత ఇవ్వాలని బోర్డు పెద్దలను కోరినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. రోహిత్, కోహ్లీలు ఇప్పటికే టీ20ల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే వన్డే వరల్డ్ కప్లో వీరిద్దరి ప్రయాణం ఎలా ఉండబోతోందనే దానిపై మొదటి నుంచీ సందేహాలు ఉన్నాయి. కోచ్ గంభీర్ అవలంబిస్తున్న వ్యూహాలు, సెలక్షన్ కమిటీ విధిస్తున్న నిబంధనలే ఈ ఇద్దరు దిగ్గజాల కెరీర్ ట్రాన్సిషన్ (మార్పు) కు కారణమయ్యాయనే టాక్ నడుస్తోంది.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడిన విరాట్ కోహ్లీ.. తాను మళ్లీ మళ్లీ ‘నిరూపించుకోవాల్సిన’ అవసరం లేని స్థితిలో ఉన్నానని చాలా స్పష్టంగా తేల్చి చెప్పాడు. మరోవైపు, భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు రోహిత్ శర్మ ప్రదర్శించిన నిస్వార్థమైన (selfless) ఆటతీరు, ప్రస్తుత వన్డే క్రికెట్కు వచ్చేసరికి కాస్త మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం గంభీర్ నేతృత్వంలోని టీం మేనేజ్మెంట్కు, ఈ సీనియర్ ఆటగాళ్లకు మధ్య ఇంకా పూర్తిస్థాయిలో ఒకే విధమైన అవగాహన కుదరలేదని స్పష్టమవుతోంది. సీనియర్లు నేరుగా బీసీసీఐ పవర్హౌస్లతో టచ్లోకి వెళ్లడం కోచ్ గంభీర్తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ను సైతం ఇరకాటంలో పడేసింది.
ఈ అంశంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. “జట్టులో ఇంతమంది హేమాహేమీలు ఉన్నప్పుడు, కెప్టెన్ శుభ్మన్ గిల్ డ్రెస్సింగ్ రూమ్లో మరింత బలంగా తన గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది. గంభీర్ మిగిలిన రెండు ఫార్మాట్లలో చూపించినంత శ్రద్ధ, ప్లానింగ్ వన్డేల విషయంలో ఇప్పటివరకు చూపించలేదు. ప్రస్తుతానికి విషయాలను వాటి మానానా వాటిని వదిలేశారు” అని అధికారులు పేర్కొన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలపై పూర్తి దృష్టి పెట్టాల్సి ఉన్నందున, గంభీర్, గిల్ ఇద్దరూ బాధ్యత తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లో తమ ఆలోచనలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయాలని బోర్డు భావిస్తోందట. ఇన్నేళ్లుగా దేశానికి ఎనలేని సేవలందించిన సీనియర్ ఆటగాళ్లకు.. రాబోయే 16 నెలల్లో జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోంది, వారి పాత్ర ఏమిటి అనే ప్రణాళికను ముందే వివరించడం చాలా ముఖ్యం.

