TDP SIR Workshop: ఎస్‌ఐఆర్‌పై టీడీపీ ప్రత్యేక వర్క్‌షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!

  • ఎస్‌ఐఆర్‌పై టీడీపీ ప్రత్యేక వర్క్‌షాప్
  • పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
  • కూటమి సమన్వయమే తొలి పరీక్ష
Tdp Sir Workshop

Tdp Sir Workshop

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై కీలక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరై ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఓటర్ల జాబితా అత్యంత కీలకమని అన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవచ్చని చెప్పారు. ఓట్ల నమోదు చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అయితే, ఓట్ల చేరికలపై ప్రజలకు అవగాహన కల్పించడం రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రతి 20 నుంచి 25 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఈ ప్రక్రియ చేపడుతున్నాం. జూలై 14లోపు రెండు విడతల్లో ఓట్ల మ్యాపింగ్ జరగనుంది. ఆలోపు ఓట్ల నమోదు, సవరణలు పూర్తిస్థాయిలో జరగాలలి. ఎస్‌ఐఆర్‌ను ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త అత్యంత సీరియస్‌గా తీసుకోవాలి. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ఓటర్ల జాబితాలో తమ ఓట్లు ఉన్నాయా లేదా అన్నది ప్రతి ఒక్కరూ నిరంతరం పరిశీలించాలి’ అని సీఎం సూచించారు.

×
×
Ad

ఎస్‌ఐఆర్ ప్రక్రియలోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జనసేన, బీజేపీతో ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా, అన్ని సందర్భాల్లోనూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎన్నికలప్పుడు మాత్రమే మిత్రపక్షాలతో కలిసి, మిగతా రోజుల్లో పట్టించుకోకపోతే కుదరదు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే కాదు, పార్టీ కార్యక్రమాల్లోనూ జనసేన, బీజేపీలతో సమన్వయం కొనసాగాలి’ అని పేర్కొన్నారు. పార్టీల మధ్య సమన్వయానికి ఎస్‌ఐఆర్ తొలి పరీక్ష అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇటీవల నిర్వహించిన మహానాడుపై కూడా సీఎం చంద్రబాబు స్పందించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడు అద్భుత విజయాన్ని సాధించిందని తెలిపారు. రెండు రోజుల కార్యక్రమానికి దాదాపు 24.50 లక్షల మంది హాజరయ్యారని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో కూటమి సాధించిన ఘనవిజయం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. కొత్తవారికి టిక్కెట్లు ఇచ్చినా, కూటమి అభ్యర్థులనే ప్రజలు విశ్వసించి ఓటేశారని గుర్తు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాలకు వెళ్లిన స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో తిరిగి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది’ అని తెలిపారు.

తనకు ఎక్కువ మంది అనుచరులు అవసరం లేదని, మంచి నాయకులు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే పార్టీ మరింత బలపడుతుందని చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ గెలుచుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఒకప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనుకాడిన పార్టీ.. పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్, టెక్నికల్ ప్లానింగ్‌తో విజయాన్ని సాధించిందన్నారు. ‘అది మన పార్టీ నెట్‌వర్క్ సామర్థ్యానికి నిదర్శనం. సరైన ప్రణాళిక, సమన్వయం ఉంటే ఏ ఎన్నికనైనా గెలవగలమని అప్పుడే నిరూపించాం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.