TDP-Janasena Manifesto Committee: వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి తెలుగుదేశం-జనసేన పార్టీలు.. ఇక.. సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నారు.. ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు రెండు పార్టీలు సిద్ధం అవుతున్నాయి.. ఇప్పటికే ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు సభ్యులతో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ నేత పట్టాభి సభ్యులుగా ఉండగా.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్.. సభ్యులుగా ఉన్నారు.. అయితే, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ఏర్పాటు చేసిన ఆ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది.. ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీఆర్ భవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది..
Read Also: Helicopter Crash: సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు సైనికులు మృతి!
కాగా, షణ్ముఖ వ్యూహం పేరుతో మేనిఫెస్టో తీసుకురానున్నట్టు గతంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.. ఇక, టీడీపీ సూపర్ సిక్స్ అంశాల్లో మహిళలు, యువత, బీసీ, రైతు, పేదలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొంది.. మహాశక్తి పేరిట ఆడబిడ్డలకు ప్రత్యేక నిధి, 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళల ఖాతాల్లో నెలకు 1,500 రూపాయలు, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డా చదువుకునేందుకు ఇంట్లో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి ప్రతీ ఏడాది రూ.15వేలు ఇలా పలు అంశాలను ప్రస్తావించింది.. ఇక, దీపం పథకం కింద ఏటా ఉచితంగా 3 సిలిండర్లు, మహిళలందరికీ జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ యువతకు 3 వేల నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల హామీ ఇలా కీలక అంశాలు ఉన్నాయి. దీంతో.. ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు చేరుస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.