Chandrababu Praja Galam: ఓవైపు వేసవిలో ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి.. మరోవైపు ఎన్నికలు హీట్ కూడా హీర్ పెంచుతున్నాయి.. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశాయి. ఇక ప్రచారం ముమ్మరం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజాగళం పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు చంద్రబాబు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనుంది తెలుగుదేశం పార్టీ..
అందులో భాగంగా ముందుగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు చంద్రబాబు.. తనకు లక్ష ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పని చేయాలని కేడర్కు దిశ నిర్దేశం చేయానున్నారు బాబు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ ప్రాంతంలో బాబు ప్రచారం ఉంటుంది. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో ప్రచారం చేస్తారు. 29న శైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం కొనసాగుతుంది. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తీలో ప్రచారం చేస్తారు. 31వ కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది.
కాగా, 1989 నుంచి కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు చంద్రబాబు. ఏడు సార్లు పోటీ చేసిన ఆయన… విజయం సాధిస్తూ వచ్చారు. 1994 నుంచి 2014 వరకూ చంద్రబాబు మెజార్టీ 45 వేలకు తగ్గలేదు. గత ఎన్నికల్లో మెజార్టీ 30 వేలకు పడిపోవడంతో.. ఈ సారి సీరియస్గా తీసుకున్నారు. ఈ సారి లక్ష ఓట్లు మెజార్టీ సాధించాలని పట్టుదలగా ఉన్నారు చంద్రబాబు. దీనికి అనుగుణంగా నేతలు, కార్యకర్తల్ని సమాయత్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. మరోవైపు.. వైనాట్ కుప్పం అంటూ సీఎం వైఎస్ జగన్.. కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయం విదితమే.