తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని అందరికీ తెలిసిందే అని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్. ఒకటే పనికి రెండు మార్గాల్లో నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ సర్కార్ మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ ఒకే పనిని వేరువేరు పథకాల కింద చూపి, వాటికి రెండు సార్లు నిధులు రాబట్టి, స్వాహా చేయడం షాక్ కు గురి చేస్తుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మోసానికి పాల్పడడం దేశంలో ఇదే మొదటిసారని, బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
Also Read : Uttar Pradesh: ప్రభుత్వ ఆఫర్.. అక్కడ సగం రేటుకే టమోటాలు..!
బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కేవలం భారీ నీటిపారుదల ప్రాజెక్టులకే పరిమితం కాలేదంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన 6 రోడ్డు ప్రాజెక్టులలోనూ పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఒకే పనిని రెండు పథకాల కింద చూపడంతో, రెండు సార్లు విడుదలైన నిధులను స్వాహా చేసిందన్నారు. ఈ రోడ్డు ప్రాజెక్టులను రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం కింద ఒకసారి, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం కింద రెండోసారి చూపి కేసీఆర్ సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలను బురిడీ కొట్టించిందని వ్యాఖ్యానించారు. అంటే ఒకే పనికి రెండు వేర్వేరు మార్గాల ద్వారా నిధులు రావడంతో, రెట్టింపునిధులు విడుదలయ్యాయని అన్నారు.
Also Read : World Cup: ప్రపంచ కప్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!
ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయ పథకం కింద విడుదలైన రూ.4,144 కోట్లు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతుందన్నారు. ఈ పథకం కింద అమలు చేసినట్టు చూపించిన పనులు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం ద్వారా అమలు చేసిన పనులే ఉన్నాయి. ఇది పెద్ద కుట్ర, మోసం, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం కింద గత తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ రహదారుల పనులు, తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పొందిన రుణాలు సహా అన్ని ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.