Tarique Rahman: బంగ్లాదేశ్లో అనూహ్య పరిస్థితి నెలకొంది. షేక్ హసీనా పీఠం నుంచి వైదొలిగిన తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె తరువాత యూనస్ తాత్కాలికంగా అధికార పీఠాన్ని అధిరోహించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో యూనస్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు “డార్క్ ప్రిన్స్”గా పేరు తెచ్చుకున్న తారిక్ రహ్మాన్ ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. చాలా ఏళ్లుగా లండన్లో ఉన్న ఆయన, 17 సంవత్సరాల తర్వాత గత డిసెంబరులో ఢాకాకు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన నేతృత్వంలోని బీఎన్పీ (BNP) పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దీంతో ప్రధాని పదవికి దారితీసే మార్గం సాఫీ అయింది. తారిక్ రహ్మాన్ అధికారాన్ని చేపడితే భారత్తో బంగ్లాదేశ్ బంధాలు ఎలా ఉంటాయి. ఇప్పటికే బంగ్లాదేశ్లో అనేక మంది హిందువులను ఊచకోత కోస్తున్నారు. ఈ ఊచకోతలు ఇకనైనా ఆగుతాయా? అనే అంశాల గురించి విపులంగా చర్చిద్దాం..
READ MORE: Bangladesh: ముగిసిన యూనస్ శకం.. ప్రజల తీర్పు ఏం చెబుతోంది?
బంగ్లాదేశ్ పరిణామాలను భారత్ చాలా దగ్గరగా గమనించింది. ఫలితాలు పూర్తిగా రాకముందే భారత ప్రధాని మోడీ తారిక్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మళ్లీ సరిచేసుకోవాలనే భారత ఆసక్తిని చూపించింది. ముఖ్యంగా 2024లో మాజీ ప్రధాని షేక్ హసీనా విద్యార్థి నిరసనల తర్వాత భారత్కు రావడంతో, ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. అయితే.. తారిక్ తన రాక తర్వాత ఇచ్చిన సందేశాల్లో ఒక కొత్త ధోరణి కనిపించింది. “బంగ్లాదేశ్ ఫస్ట్” అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పిన “అమెరికా ఫస్ట్” నినాదాన్ని తలపిస్తుంది. ప్రస్తుతం తారిక్ విదేశాంగ విధానంలో భాగంగా భారత్, చైనా, పాకిస్తాన్లకు సమానంగా చూస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ చైనా, పాకిస్తాన్లపై ప్రేమ కరిపిస్తూ భారత్ను పక్కన పెట్టారు. ఇప్పుడు తారిక్ రాకతో భారత్కు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.
READ MORE: Janasena: తెలంగాణలో ఖాతా తెరిచిన జనసేన.. ఏ జిల్లాలో గెలిచిందంటే..?
అయితే తారిక్కు భారత్తో సంబంధాలు రెండు వైపులా సవాళ్లతో కూడి ఉన్నాయి. ఒక వైపు భౌగోళికంగా భారత్ను పక్కన పెట్టడం అసాధ్యం. దాదాపు 4,000 కిలోమీటర్ల సరిహద్దు, వాణిజ్యం, విద్యుత్ సరఫరా, రవాణా ఇవన్నీ రెండు దేశాలను బలంగా కట్టిపడేశాయి. మరోవైపు, బంగ్లాదేశ్ యువతలో భారత్పై అనుమానం పెరిగింది. ముఖ్యంగా హసీనా భారత్కు రావడంతో ఆ భావన మరింత బలపడింది. ఈ నేపథ్యంలో తారిక్ సంబంధాలను మెరుగుపరచడం ప్రాధాన్యంగా తీసుకోవాల్సిందే. గత ఏడాది ఆయన తల్లి, మాజీ ప్రధాని ఖలేదా జియా అనారోగ్యంతో ఉన్నప్పుడు, ప్రధాని మోడీ సహాయం అందిస్తామని చెప్పారు. బీఎన్పీ దీనికి కృతజ్ఞతలు తెలిపింది. తరువాత ఆమె మరణించినప్పుడు, భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఢాకా వెళ్లి తారిక్ను కలుసుకున్నారు. మోడీ రాసిన వ్యక్తిగత లేఖను సైతం అందజేశారు. ఇవన్నీ సంబంధాలను మళ్లీ సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలుగా కనిపించాయి.
READ MORE: Janasena: తెలంగాణలో ఖాతా తెరిచిన జనసేన.. ఏ జిల్లాలో గెలిచిందంటే..?
తారిక్ ఎప్పుడూ తన ప్రసంగాల్లో భారత్ వ్యతిరేక భావాలను రెచ్చగొట్టలేదు. బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత, ముఖ్యంగా హిందువులపై దాడులు జరిగిన సమయంలోనూ మితంగా స్పందించారు. “మతం వ్యక్తిగత విషయం, కానీ దేశం అందరిదీ” అని చెప్పి అందరికీ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ జనాభాలో సుమారు 8 శాతం ఉన్న హిందువులకు ఇది కొంత నమ్మకం కలిగించింది. అయితే కొన్ని అంశాల్లో తారిక్ గట్టి వైఖరి తీసుకున్నారు. సరిహద్దు కాల్పులు ఆపాలని, టీస్టా నది జలవిభజన ఒప్పందంలో బంగ్లాదేశ్కు న్యాయం చేయాలని చెప్పారు. Teesta River, పద్మా నదుల నీరు తమ దేశ జీవనాధారం అని స్పష్టం చేశారు. ఈ అంశాలు భవిష్యత్తులో చర్చలకు కారణమయ్యే అవకాశం ఉంది.
ఇప్పుడున్న ఆశల మధ్య, తారిక్ గతం గుర్తుకు వస్తోంది. 2001 నుంచి 2006 వరకు బీఎన్పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు బాగా క్షీణించాయి. అప్పట్లో జమాత్ పార్టీ బీఎన్పీకి మిత్రపక్షం. ఢాకాలోని “హావా భవన్” అనే కేంద్రం నుంచి అసలు నిర్ణయాలు తీసుకున్నారని అప్పటి దౌత్యవేత్తలు చెప్పారు. తారిక్ అక్కడ ప్రభావశీల వ్యక్తిగా ఉండేవారు. 2004లో జరిగిన చిట్టగాంగ్ ఆయుధాల కేసులోనూ ఆయన పేరు వినిపించింది. ఈ కేసులో United Liberation Front of Asomతో కుట్ర జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 2005లో ఒక అమెరికా దౌత్య లేఖలో ఆయనను “డార్క్ ప్రిన్స్” అని పేర్కొన్నారు. తరువాత 2008లో Dhaka Tribune పత్రికలో వచ్చిన అవినీతి కథనాలు సైతం ఆ పేరును మరింత బలపరిచాయి. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. తారిక్ నేరుగా అధికారంలోకి వస్తున్నారు. ఆయనకు గతం ఒక నీడలా వెంటాడుతోంది. కానీ కొత్త అవకాశాలు సైతం ఉన్నాయి. భారత్తో కొత్త అధ్యాయం మొదలవుతుందా? లేక పాత గాయాలు మళ్లీ బయటపడతాయా? అనే అంశం క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. చివరిగా ఒక్క విషయం.. భారత్-బంగ్లాదేశ్ “మైత్రి” సాఫీగా సాగాలంటే, రెండు దేశాలు జాగ్రత్తగా అడుగులు వేయాలి.