Pakistan Team: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మధ్యలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అనేక చర్చలకు దారి తీస్తుంది. కొలంబోలో చిత్రీకరించబడినట్లుగా ఉన్న వీడియోలో పాకిస్థాన్ ఆటగాళ్లు జట్టు బస్సు నుంచి దిగిన తర్వాత ధూళితో ఉన్న రోడ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల మధ్య నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది.
ఆ వీడియోలో కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, సయీమ్ అయూబ్ వంటి ఆటగాళ్లు కనిపించడంతో ఈ వీడియో మరింత వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్ల నుండి భారీ స్పందన వచ్చింది. అంతర్జాతీయ టోర్నమెంట్కు వచ్చిన జట్టుకు సరైన వసతులు కల్పించలేదా అని ప్రశ్నింస్తుంటే.. మరికొందరు ఆ ప్రదేశాన్ని “సిమెంట్ ఫ్యాక్టరీలా కనిపిస్తోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు భారత్ తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ వీడియో నిజంగా జట్టు వసతి గృహానికి సంబంధించినదా.. లేక ట్రైనింగ్ ప్రాంతమా లేదా స్టేడియం వెనుక భాగమా అన్నది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఐసీసీ లేదా శ్రీలంక క్రికెట్ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వీడియో వైరల్ కావడం కూడా ప్రస్తుతం జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్ వివాదం నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం మొదట నిర్ణయించింది. దీనిపై ఐసీసీ, పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరిగాయి.
లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన క్లోజ్డ్ డోర్ సమావేశం దాదాపు నాలుగు గంటలు కొనసాగింది. సభ్యుల ఒప్పందం ప్రకారం ‘ఫోర్స్ మజ్యూర్’ పరిస్థితిని పీసీబీ ఎలా సమర్థించగలదో ఐసీసీ వివరాలు కోరినట్లు సమాచారం. మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి భారీ నష్టం కలగవచ్చని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. చివరికి పాకిస్థాన్ ప్రభుత్వం తన బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో.. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా జరుగనుంది.
This is the “hospitality” Pakistan cricket team got in Colombo from Sri Lanka and the ICC.
Looks less like a team hotel and more like workers clocking out of a cement factory. 😂 pic.twitter.com/MpyFVmtJho
— Wahida 🇦🇫 (@RealWahidaAFG) February 9, 2026
