Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్‌ బాద్‌షా గురించి ఆసక్తికర విషయాలు..

Suvendu Adhikari

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సరికొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సువేందు అధికారి, బెంగాల్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అమిత్ షా స్వయంగా సువేందు అధికారి పేరును ప్రతిపాదించగా, ఎనిమిది వేర్వేరు ప్రతిపాదనలు సైతం ఆయన పేరే సూచించడంతో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఎన్నికైన వెంటనే సువేందు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు.

ఇక, 55 ఏళ్ల సువేందు అధికారి ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థుడైన అనుచరుడిగా ఉండేవారు. ఇప్పుడు అదే మమతాను ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం విశేషం. “బెంగాల్ నుంచి భయం (భోయ్) పోయింది, నమ్మకం (భరోసా) వచ్చింది” అని సువేందు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత 55 ఏళ్లలో కోల్‌కతా వెలుపల, అంటే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ముఖ్యమంత్రి అవుతున్న తొలి నేతగా సువేందు రికార్డు సృష్టించబోతున్నారు. 1971లో అజోయ్ ముఖర్జీ తర్వాత జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ సీఎం అవుతున్నది ఈయనే. మాజీ కేంద్ర మంత్రి సిసిర్ అధికారి కుమారుడైన సువేందు, కాంగ్రెస్ విద్యార్థి విభాగం ‘ఛత్ర పరిషత్’ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఆపై తృణమూల్ కాంగ్రెస్‌లో కీలకంగా ఎదిగి, చివరకు బీజేపీలో చేరి మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థిగా మారారు.

ఇక, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ బీజేపీ 207 సీట్లతో ఘనవిజయం సాధించగా, తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. అయితే, ఓటమిని అంగీకరించని మమతా బెనర్జీ, లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, తమ ప్రజాదేశాన్ని కుట్రపూరితంగా దోచుకున్నారని ఆరోపించారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె భీష్మించుకున్నప్పటికీ, గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి సువేందును ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. బెంగాల్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, స్థిరమైన పాలన అందిస్తామని బీజేపీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.