బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకే నాకు టికెట్ ఇవ్వలేదని సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. సూర్యాపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు జనగాం క్రాస్ రోడ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Read Also: Telangana BJP: నామినేషన్లకు నేడే ఆఖరు రోజు.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని బీజేపీ
ఇక, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు ధ్వజమెత్తారు. అయితే, వరుసగా రెండవసారి టికెట్ ఆశించి భంగపడటంతో పటేల్ రమేష్ ఆయన సతీమణి లావణ్య రెడ్డి బోరున విలపించారు. పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ రాలేదన్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు రమేష్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో ఇంటి దగ్గరికి భారీగా చేరుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని పటేల్ రమేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు టికెట్ రాకుండా కుట్ర జరిగిందని.. ఇదంతా మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించేందుకే చేశారని పటేల్ రమేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.