Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి ఎదురుదెబ్బ

Supreme Court

Supreme Court

Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ తిరస్కరణపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం ‘ఎన్నికల పిటిషన్’ (Election Petition) దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేస్తూ, మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై కీలక విచారణ జరిపింది. మీనాక్షి నటరాజన్ తరఫున కోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బలమైన వాదనలు వినిపించారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, ఒక ప్రైవేట్ ఫిర్యాదుకు సంబంధించిన అంశాన్ని కోర్టు ఇంకా పరిగణనలోకి కూడా తీసుకోలేదని సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ వ్యవహారంలో కేవలం నోటీసు మాత్రమే ఇచ్చారని, అలాంటప్పుడు క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన వాదించారు. రిటర్నింగ్ అధికారి చట్ట విరుద్ధంగా, అత్యంత ఏకపక్షంగా వ్యవహరించి నామినేషన్‌ను తిరస్కరించారని కోర్టుకు విన్నవించారు. అయితే, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మైలురాయి లాంటి తీర్పులను ఉటంకించిన ధర్మాసనం, ఎన్నికల ప్రక్రియ మధ్యలో కోర్టులు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై ఇప్పుడు స్టే ఇవ్వలేమని, బాధితులు ఎన్నికల అనంతరం తగిన హైకోర్టును ఆశ్రయించడమే ఏకైక మార్గమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో మీనాక్షి నటరాజన్‌కు ప్రస్తుతానికి న్యాయపరమైన ఉపశమనం లభించనట్లయింది.

×
×
Ad