NTV Telugu Site icon

Sharad Pawar: సుప్రీంకోర్టులో శరద్‌ పవార్‌‌కు ఊరట

Sharad Pawar

Sharad Pawar

లోక్‌సభ ఎన్నికల వేళ శరద్‌ పవార్‌ వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ- శరద్‌చంద్ర పవార్‌ అనే పార్టీ పేరును, అలాగే బాకా ఊదుతోన్న వ్యక్తి గుర్తును ఉపయోగించుకునేందుకు శరద్‌ పవార్‌ వర్గానికి న్యాయస్థానం అనుమతించింది. ఈ మేరకు పేరు, చిహ్నాన్ని గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌లకు ధర్మాసనం ఆదేశించింది. ఆ గుర్తును ఇతర పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించొద్దని సూచించింది.

అజిత్‌ పవార్‌ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. అయితే ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తు గడియారంను కూడా వారికే కేటాయించింది. అయితే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో సమాన అవకాశాలను దెబ్బతీస్తుందని పేర్కొంటూ.. ఎన్సీపీ ఆ గుర్తును ఉపయోగించకుండా ఆదేశించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు గడియారం గుర్తు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. న్యాయ నిర్ణయానికి లోబడే దాన్ని వినియోగిస్తున్నట్లు వార్తాపత్రికల్లో పబ్లిక్‌ నోటీసు జారీ చేయాలని అజిత్‌ వర్గానికి సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రకటనలు, ప్రచార సామగ్రిలోనూ ఈ విషయాన్ని వెల్లడించాలని చెప్పింది. అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ ఫిబ్రవరి 6న ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ శరద్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని అజిత్‌ వర్గాన్ని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Bihar: పట్టాలు తప్పిన ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రైలు..

అజిత్ పవర్ వర్గం ఎమ్మెల్యేలంతా ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరారు. దీంతో అసలైన ఎన్సీపీగా తమను గుర్తించాలని ఈసీని కోరగా.. ఆ మేరకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం పార్టీ, ఎన్నికల గుర్తును కూడా అజిత్ వర్గం వినియోగిస్తోంది.