Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!

Student Death Ap

Student Death Ap

పోలవరం జిల్లాలోని రంపచోడవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో నేరుగా మాట్లాడిన విద్యార్థిని మృతురాలు కావడంతో.. ఈ ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీకి చెందిన ముర్రం శివాని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని రేకుల షెడ్‌లో ఉరివేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను విచారిస్తూ విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఈ నెల 24న రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ కార్యక్రమంలో సీఎం పక్కనే కూర్చొని మాట్లాడిన విద్యార్థినే ఈ ముర్రం శివాని. సీఎంతో ఎంతో చక్కగా మాట్లాడిన శివాని.. రెండు రోజుల వ్యవధిలో మృతి చెందడం స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. శివాని మృతికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి.