Site icon NTV Telugu

IPL 2026: సన్‌రైజర్స్‌ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్!

Ipl 2026

Ipl 2026

IPL 2026: ఐపీఎల్ 2026 తొలి పోరు శనివారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా బౌలర్ల క్రమశిక్షణ లేని ప్రదర్శనే జట్టు పరాజయానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు.

READ ALSO: MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..

నియంత్రణ కోల్పోయిన బౌలర్లు..
మ్యాచ్ అనంతరం వెట్టోరి మాట్లాడుతూ.. “మా బౌలింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేదు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడంలో విఫలమయ్యాం. దీనివల్ల ఆర్‌సీబీ బ్యాటర్లు సులువుగా పరుగులు సాధించారు” అని పేర్కొన్నారు. ఆరంభంలోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ తీసి ఒత్తిడి పెంచినా, ఆ తర్వాత బౌలర్లు ఆ పట్టును నిలబెట్టుకోలేకపోయారని ఆయన విమర్శించారు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో విజయాన్ని తమ నుంచి దూరం చేశారని వెట్టోరి ఒప్పుకున్నారు. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ సేవలను ఎస్‌ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లో బాగా మిస్ అయిందని కోచ్ అన్నారు.

డేవిడ్ పైన్ 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, తర్వాత రెండు వికెట్లు తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడన్నారు. యువ స్పిన్నర్ హర్ష్ దూబే ప్రదర్శనను వెట్టోరి మెచ్చుకున్నారు. చిన్నాస్వామి వంటి కష్టమైన పిచ్‌పై కూడా అతను నియంత్రణతో బౌలింగ్ చేసి కీలక వికెట్ తీశాడని ప్రశంసించారు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనా, బ్యాటర్ల పోరాట పటిమను ఆయన కొనియాడారు. 38 బంతుల్లోనే 80 పరుగులతో విధ్వంసం సృష్టించిన ఇషాన్ కిషన్‌ను కోచ్ మెచ్చుకున్నారు. 7వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అనికేత్ వర్మ కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులు చేయడం అద్భుతమని వెట్టోరి కొనియాడారు.

READ ALSO: MI vs KKR: నేడే ముంబై ‘తొలి మ్యాచ్’.. ఆ చెత్త రికార్డ్‌ను వాంఖడేలో చెరిపేస్తుందా?

Exit mobile version