Site icon NTV Telugu

Off The Record: స్పీకర్ విచారణకు హాజరుకాని ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతేంటి?

Brs

Brs

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ విచారణకు హాజరవని మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతేంటి? లిస్ట్‌లో మొత్తం పది మంది ఉంటే… 8మందిని విచారించి ఐదుగురి విషయంలోనే తీర్పు ఇవ్వడం వెనక ఉద్దేశ్యం ఏంటి? ఆ ముగ్గురి విషయంలో తీర్పు ఎప్పుడు? ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ రియాక్షన్‌ ఎలా ఉండబోతోంది?

బీఆర్‌ఎస్‌ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వరుసగా జడ్జిమెంట్ ఇస్తున్నారు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది విచారణ ముగియగా… ఐదుగురి విషయంలో మాత్రమే తన నిర్ణయాన్ని ప్రకటించారు స్పీకర్‌. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి మీదున్న అనర్హత పిటిషన్స్‌ డిస్మిస్ చేశారాయన. అంటే వీళ్ళు ఎవరూ పార్టీ ఫిరాయించలేదన్నది స్పీకర్‌ జడ్జిమెంట్‌. వాళ్ళు పార్టీ ఫిరాయించారనడానికి సరైన ఆధారాలు బీఆర్‌ఎస్‌ సమర్పించలేకపోయిందని అభిప్రాయపడ్డారు గడ్డం ప్రసాద్‌కుమార్‌. దీంతో వాళ్ళు సభ్యులుగా సభలో కొనసాగుతారంటూ తన తీర్పులో పేర్కొన్నారాయన. పార్టీ మారిన మొత్తం పదిమంది ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల విచారణ ఇంకా పూర్తి కాలేదు.

Also Read:Taliban: భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘాన్ తాలిబాన్లు, ఇక పాకిస్తాన్ ఎండిపోవాల్సిందే..

ఆ సంగతి ఎలా ఉన్నా… విచారణ ముగించిన ఎమ్మెల్యేల్లో ఇంకా ముగ్గురి సంగతిని ఎందుకు పెండింగ్ పెట్టారన్నది ఇప్పుడు క్వశ్చన్‌. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్ విచారణ ముగిసింది. స్పీకర్ తీర్పును ప్రకటించాల్సి ఉంది. ఇక్కడే సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు తీర్పు ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ముందే ప్రకటించేశారని, మిగతా వాళ్ళ విషయంలో టైం తీసుకోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి వచ్చిన ఆర్గుమెంట్స్ తోపాటు… ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read:The Rajasaab Premieres: ప్రభాస్‌ ‘రాజా సాబ్’ అప్‌డేట్‌.. ప్రీమియర్స్‌ ఎప్పుడో తెలుసా?

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు స్పీకర్‌కు ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న క్రమంలో…ఎలాంటి సాక్ష్యాలు లేని ఐదుగురి విషయంలో నిర్ణయం తీసుకుని మిగతా వాటిని పెండింగ్‌లో పెట్టి ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. గడువులోపు ఎంతో కొంత విచారించిన రిపోర్ట్‌ను సుప్రీం కోర్ట్‌కు సబ్‌మిట్‌ చేస్తే… వెసులుబాటు ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉండి ఉండవచ్చంటున్నారు. మొత్తం మీద చాలా రోజులుగా జరుగుతున్న విచారణలో ఓ పర్వం ముగిసిందని అంటున్నారు. అయితే స్పీకర్ నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ ఎలా రియాక్ట్‌ అవబోతోంది. అందుకు స్పీకర్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ప్రశ్న.

Exit mobile version