జేఈఈ (JEE) కారణంగా మరో విద్యాకుసుమం నేలరాలిపోయింది. సారీ నాన్నా… నేను జేఈఈ చేయలేను అంటూ తనువు చాలించాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ (Rajasthan) కోటాలో చోటుచేసుకుంది.
కోటా(Kota)లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్లోని భాగల్పూర్కు చెందిన అభిషేక్ కుమార్(Abhishek Kumar) కోటాలోని విజ్ఞాన్ నగర్లో తాను అద్దెకు ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
అభిషేక్ విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సారీ నాన్నా… నేను జేఈఈ చేయలేను అంటూ తన తండ్రిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్ గదిలో లభ్యమైంది. కోచింగ్ సెంటర్లో జనవరి 29, ఫిబ్రవరి 19న జరిగిన రెండు పరీక్షలకు అభిషేక్ హాజరుకాలేదని పోలీసులు తెలిపారు.
ఈ ఏడాదిలో ఇది ఆరో ఘటన. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో జిల్లా యంత్రాంగం కౌన్సెలింగ్ సౌకర్యాలను అందించడానికి, కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ఆత్మహత్యలు ఆగట్లేదు. గత ఏడాది 26 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడగా ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే అరడజను కేసులు నమోదవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.