Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి అనారోగ్యంతో బుధవారం గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ఏవైనా ఉన్నాయా అనే కోణంలో వైద్యులు పరీక్షలు జరిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ధృవీకరించారు.
సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియగానే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన కేరళ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. కోజికోడ్లో జరగాల్సిన ర్యాలీలో వర్చువల్గా పాల్గొంటూ.. “ఒక కొడుకుగా నా తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. కేరళ ప్రజలు నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో తన తల్లిని ప్రతి గంటకూ పర్యవేక్షిస్తూ తనకు ధైర్యాన్నిచ్చిన ఓ కేరళ నర్సు గురించి రాహుల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా సోనియా గాంధీ తరచూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి 24న జ్వరం, ఇన్ఫెక్షన్ కారణంగా గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అలాగే గతేడాది జూన్ 7న, అంతకుముందు కూడా జీర్ణకోశ సంబంధిత సమస్యలతో పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. తాజాగా మరోసారి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ క్షేమంగా తిరిగి రావడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
