గత నెల 26న ఒక్కటైన టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వివాహ విందు వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులతో పాటు, సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్ర తారలందరూ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వంటి వారు విచ్చేశారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కేటీఆర్ దంపతులు, హరీష్ రావు, మల్లారెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా, నాని, నాగచైతన్య, రవితేజ వంటి స్టార్ హీరోలు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, కృతి సనన్, మృణాల్ ఠాకూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుకుమార్, నాగ్ అశ్విన్, శేఖర్ కమ్ముల మరియు దిల్ రాజు వంటి దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకలో సందడి చేశారు. కొత్త జంట తమ కుటుంబ సభ్యులతో కలిసి అతిథులకు అభివాదం చేస్తూ కనిపించిన దృశ్యాలు కనులవిందుగా నిలిచాయి. కానీ..
ఈ గ్రాండ్ ఈవెంట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని. నమ్రతా శిరోద్కర్తో కలిసి వచ్చిన సితార, బ్యూటిఫుల్ పింక్ కలర్ లెహంగాలో దేవకన్యలా మెరిసిపోయింది. రిసెప్షన్ స్టేజ్ పై విజయ్, రష్మికలతో కలిసి సితార దిగిన క్యాండిడ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సితార క్యూట్ స్మైల్ చూసి మహేష్ ఫ్యాన్స్ “లిటిల్ స్టార్” అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు