Karnataka: కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోబోతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటక పగ్గాలను డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్కు అప్పగించాలని నిర్ణయించడమే దీనికి కారణం. అయితే, ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బుధవారం రాత్రి అత్యవసర కుటుంబ పనిమీద తన సొంతూరు ముంబైకి వెళ్లిపోయారు. ఆయన తిరుగు ప్రయాణం ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. అయినప్పటికీ, సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి సమర్పించనున్నట్లు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికంటే ముందే, 77 ఏళ్ల సిద్ధరామయ్య తన నివాసంలో డి.కె. శివకుమార్తో పాటు తన కేబినెట్ సహచరులకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ నాటకీయ పరిణామాలన్నీ బుధవారం ఢిల్లీలో జరిగిన హైడ్రామా తర్వాతే మొదలయ్యాయి. సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కె.సి. వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై అధికారికంగా పెదవి విప్పకపోయినా, సూర్జేవాలా మాత్రం ఎలాంటి ముగింపులకు రావద్దని, ఇంకా శాసనసభా పక్ష (CLP) సమావేశం జరగలేదని మీడియాకు చెప్పారు. ఒకవేళ నాయకత్వ మార్పు ఉంటే, సీఎల్పీ కొత్త నేతను ఎన్నుకుంటుందని పేర్కొన్నారు.
అయితే, అధిష్ఠానం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకే సిద్ధరామయ్య దిగిపోవడానికి అంగీకరించారని తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ జోక్యంతోనే శాంతించినట్లు సమాచారం. ఈ అంశంపై గతంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ, లోక్సభ ప్రతిపక్ష నేత (రాహుల్ గాంధీ) చెబితే తాను రాజీనామా చేస్తానని బహిరంగంగానే చెప్పారు. సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో పెద్ద పీట వేస్తామని, రాజ్యసభ సీటు ఇస్తామని అధిష్ఠానం ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.వి. దేశ్పాండే మాట్లాడుతూ.. సిద్ధరామయ్య స్వయంగా తనకు రాజీనామా నిర్ణయాన్ని చెప్పారని వెల్లడించారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు వద్దని వారించినా, అధిష్ఠానానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని సిద్ధరామయ్య అన్నట్లు చెప్పారు. బుధవారం రోజంతా సిద్ధరామయ్య నివాసానికి మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి ఎక్కువైంది. ఈ విషయాన్ని సీఎల్పీ సమావేశంలో చర్చించాలని కొందరు కోరినా సీఎం నుంచి సానుకూల స్పందన రాలేదు. అటు హోంమంత్రి జి. పరమేశ్వర కూడా ఢిల్లీలో ఏం జరిగిందో అక్కడ ఉన్నవాళ్లకే తెలుసంటూ, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు.
