Cherlopalli Incident: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. ​50 మంది కార్మికులపై యజమాని..!

  • చెర్లోపల్లిలో సభ్యసమాజం తలదించుకునే ఘటన
  • 50 మంది కార్మికులపై యజమాని కర్కశత్వం
  • జీతాలు అడిగినందుకు చిత్రహింసలు
Tirupati brick kiln incident

Tirupati brick kiln incident

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం చెర్లోపల్లిలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. స్థానిక ‘SAB’ ఇటుక బట్టీలో పని చేస్తున్న ఒడిశాకు చెందిన కూలీలపై యజమాని పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. కడుపు నిండా తిండి పెట్టకపోగా, చేసిన పనికి జీతాలు అడిగినందుకు వారిని చిత్రహింసలకు గురిచేశాడు. ఒడిశా నుంచి వలస వచ్చిన సుమారు 50 మంది కూలీలు గత కొంతకాలంగా ఈ బట్టీలో పనిచేస్తున్నారు. అడ్వాన్స్‌లు ఇచ్చామన్న సాకుతో యజమాని వారిని బానిసలకంటే హీనంగా చూస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక 10 రోజుల క్రితం ఇంటర్నెట్ నేషనల్ జస్టీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కూలీలు ఒడిశా లేబర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలిసిన యజమాని ఆగ్రహంతో ఊగిపోయి, కూలీలపై మరోసారి దాడికి తెగబడ్డాడు. వారిని ఒక లారీలో బలవంతంగా నిర్బంధించి, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టి చేతులు దులుపుకున్నాడు. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం బాధితుల ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరడంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు అర్ధరాత్రి సమయంలో మెరుపు దాడి నిర్వహించి.. చెల్లాచెదురైన కూలీలను సురక్షితంగా రక్షించారు. బాధితులందరినీ వెంటనే తిరుపతి కలెక్టరేట్‌కు తరలించారు.

​ప్రస్తుతం ఆర్డీవో రామ్మోహన్ బాధితుల నుంచి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసుకున్నారు. అడ్వాన్స్‌లు ఇచ్చి తమను వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, తిండి పెట్టకుండా కొడుతున్నారని కూలీలు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడైన ఇటుక బట్టీ యజమానిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. కటకటాల్లోకి పంపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ వేగవంతమైన చర్యతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.