NTV Telugu Site icon

Srisailam: రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజున ఏ ఉత్సవమో తెలుసా!

Srisailam Bramhostavalu

Srisailam Bramhostavalu

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం ఆలయం సుందరంగా ముస్తాబైంది. ఆలయంలో గోపురాలను విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చె భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు దేవస్థాన యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూలైన్లు మంచినీరు, భోజనం వసతి తదితర భారీ ఏర్పాట్ల పనులపై అధికారులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయం ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 8న పాగాలంకరణ, కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు.

జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని ఈవో పెద్దిరాజు వెల్లడించారు. 5వ తేదీన సాయంత్రం 7:30 నుంచి 11 గంటల వరకు వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కి ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..
*మార్చి 1వ తేదీ (శుక్రవారం)- ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
*మార్చి 2వ తేదీ- భృంగీ వాహన సేవ, ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు.
*మార్చి 3వ తేదీ- హంస వాహన సేవ, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పణ
*మార్చి 4వ తేదీ- మయూర వాహన సేవకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పణ.
*మార్చి 5వ తేదీ- రావణ వాహన సేవకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పణ
*మార్చి 6వ తేదీ -పుష్పపల్లకీ సేవ
*మార్చి 7వ తేదీ- గజవాహన సేవ
*మార్చి 8వ తేదీ- మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రభోత్సవం, నంది వాహన సేవ. లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం
*మార్చి 9వ తేదీ- రథోత్సవం, తెప్పోత్సవం
*మార్చి 10వ తేదీ- ధ్వజావరోహణం
*మార్చి 11వ తేదీ- అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు.

ఏర్పాట్లపై జేసీ సమీక్ష
శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాల జిల్లా జేసీ రాహుల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రికి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. అటవీ మార్గం పాదయాత్రలో వచ్చే భక్తులకు 13 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దర్శన క్యూలపై దృష్టి పెట్టి భక్తులకు షామియానాలు, మ్యాట్‌లు ఏర్పాటు చేశామన్నారు. హెల్ప్ లైన్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వేయి మంది పారిశుద్ధ్య కార్మికులతో 12 ట్రాక్టర్స్‌లో తడి, పొడి చెత్తను వేరు చేసి ఎప్పటికప్పుడు డంప్ యార్డ్‌కు తరలిస్తామన్నారు. పాదయాత్ర భక్తులకు ఇబ్బంది లేకుండా వీవీఐపీలకు స్లాట్ ప్రకారం దర్శనం కల్పిస్తామన్నారు. 30 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల ఆహారం, ఆరోగ్యం, వసతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. శ్రీశైలంలో జరిగే కార్యక్రమాలన్నీ మీడియా, సోషల్ మీడియా శ్రీశైలటీవీ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తామని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి వివరించారు.