ఏప్రిల్ 26న రాష్ట్రానికి వస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను తగిన విధంగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి మంగళవారం అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆమె అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పరిశీలించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆమె పోలీసు శాఖను ఆదేశించారు. పోలీసు, ప్రొటోకాల్ విభాగం సమన్వయంతో వైద్య సహాయం, అన్ని వేదికల వద్ద సరిపడా వైద్య సిబ్బంది, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్య శాఖను కోరారు.
ఉపరాష్ట్రపతి వినియోగించే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బీ శాఖకు తెలిపారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖను ఆదేశించారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖకు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఉపరాష్ట్రపతి పర్యటన సజావుగా, సంతృప్తికరంగా జరిగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, గవర్నర్ సెక్రటరీ బి వెంకటేశం, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తు, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.