Padma Rao Goud: పార్లమెంట్లో ప్రజల గొంతుకగా నిలిచేందుకే తనకు మద్దతు తెలపాలని.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇతర నేతలతో కలిసి రాంగోపాల్ పేట్, నల్లగుట్ట, కాచిబౌలి, గైదన్ భాగ్ బస్తీలలో పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. పద్మారావు నగర్లో పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పద్మారావు గౌడ్ పర్యటనకు ప్రజలు అనూహ్య స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి తమ పర్యటనలకు మంచి స్పందన లభించిందని తెలిపారు. తమ విజయం ఖాయంగా మారిందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు శ్రమించి పోలింగ్ శాతం పెంచుకుంటే తమ ఆధిక్యత పెరుగుతుందని అన్నారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనుందని అన్నారు. తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందన్నారాయన. కేసీఆర్ నాయకత్వంలోని 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని .. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుందన్నారు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్.