చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆర్ 5 జోన్ లే అవుట్ లలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఈ రోజు పర్యటించారు.. నవులూరు, కృష్ణాయపాలెంలో లేఅవుట్లను పరిశీలించారు.. అయితే, కృష్ణాయపాలెంలో అమరావతి రైతుల నినాదాలు చేశారు.. సజ్జల కాన్వాయ్ వెళుతున్న సమయంలో ఆర్ 5 జోన్ వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు అమరావతి రైతులు.. తన పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడిన సజ్జల.. లే అవుట్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.. ప్రైవేటు లే అవుట్లు కూడా ఇంత చక్కగా ఉండవని ప్రశసించారు.. లేఅవుట్లలో 62 శాతం రోడ్లు, ఓపెన్ స్పేస్ గా వదిలాం.. ఇంటర్నల్ రోడ్ల కోసం 36 శాతం భూమి కేటాయించామని.. స్లమ్స్ అని ఎలా అంటారు? అని నిలదీశారు.. మొత్తం స్థలంలో 38 శాతం మాత్రమే ప్లాటింగ్ చేశాం అని వెల్లడించారు..
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలెంజ్ విసిరారు సజ్జల.. చంద్రబాబు తన హయాంలో ఎక్కడ భూమి ఇచ్చాడో చెప్పాలన్న ఆయన.. ఒక సెంటు ఇచ్చినా చూపించమని అడుగుతున్నాం.. చూపిస్తే స్వయంగా క్షమాపణ చెబుతాం.. చూపించలేకపోతే.. నేను అబద్దాలు చెప్పానని చంద్రబాబు ఓపెన్ గా అంగీకరించాలి అని సవాల్ చేశారు.. చంద్రబాబు రాజకీయంలో పేదలకు చోటు ఉండదన్న సజ్జల.. చంద్రబాబు దిక్కుమాలిన లెక్కలు వేసుకోవటం వల్లే ప్రజలు తిరస్కరించారన్నారు.. చంద్రబాబు చెప్పినట్లు ఇవి స్లమ్ లు, శ్మశానలు అయితే లబ్దిదారులు టీడీపీకే మద్దతు ఇస్తారు కదా? మరి ఎందుకు భయపడటం? అంటూ ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఆరోగ్యకరమైన వాతావరణం.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ళు సిద్ధం అయ్యాయి అని వెల్లడించారు సజ్జల.. 30 వేల కోట్లు వెచ్చించి భూమి కొనుగోలు చేశాం.. ఇది ఒక మహా యజ్ఞంగా సాగుతోంది.. సైంధవుల్లా పేదలకు స్థానం లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు మాష్టర్ ప్లాన్ లో తన వర్గం మినహా మిగిలిన వారు ఎవరూ ఉండకుండా చూశారని ఆరోపించారు.. ఈ ప్రయత్నాలను ముఖ్యమంత్రి జగన్ అడ్డుకుని పేదలకు, బలహీన వర్గాలకు ఇళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.. కోర్టులకు కూడా వెళ్ళి అడ్డుకోవాలి అనుకున్నారన్న ఆయన.. దురాలోచన, దుగ్ద, కడుపుమంట, తిట్లు, బూతులు అన్నీ వీరి స్వభావాన్ని అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు..
లే అవుట్ల మార్గదర్శకాల ప్రకారం అన్ని సదుపాయాలు వీటిలో ఉన్నాయి.. వీటిని స్లామ్ అనటానికి నోరు ఎలా వస్తుందో అర్ధం కావటం లేదు అని ఫైర్ అయ్యారు సజ్జల.. టీడీపీతో పాటు వామపక్షాలు కూడా అనటం ఆశ్చర్యంగా ఉందన్న ఆయన.. చంద్రబాబు టిడ్కో ఇళ్ళల్లో మౌలిక సదుపాయాల గురించి ఆలోచించలేదన్నారు. అప్పు రూపంలో ప్రజల పై భారం వేశారు.. మూడు లక్షల ఇళ్ళు ఇచ్చాను అని చంద్రబాబు అంటున్నాడు.. ప్రజల రక్తం పీల్చి తనకు కావాల్సిన డబ్బులు దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి.