సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో అన్ని సమస్యల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిపింది. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మె తాత్కాలికంగా విరమించుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్ లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇక బస్సులు యధావిధిగా నడుస్తాయి.
READ MORE: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. నిందితులుగా ఆ ముగ్గురు!
మరోవైపు.. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని యాజమాన్యం తెలిపింది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖను రాసింది. ఆలేఖలో సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. తల్లిలాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంతో సమస్యలు పరిష్కరించుకుందామని యాజమాన్యం తెలిపింది. సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుని అభివృద్ధి పథంలో వెళ్తోందని చెప్పింది. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ సంక్షోభంలోకి వెళ్లిందంది. ఒక వర్గం మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితం కావొద్దని కోరింది.