భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విడుదలైన ప్రాథమిక సమాచారం ప్రకారం.. మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రైల్వే రంగంలో స్థిరమైన కెరీర్ ఆశించే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రారంభం: మే 15, 2026 నుంచి…
దరఖాస్తు గడువు: జూన్ 14, 2026 వరకు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమకు కేటాయించిన RRB అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. గడువు తేదీ లోపు అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
వయోపరిమితి..
కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు.
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు.
నిబంధనల ప్రకారం.. ఓబీసీ (OBC), ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు దివ్యాంగుల వంటి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నిర్దేశించిన సాంకేతిక విద్యార్హతలను కలిగి ఉండాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి టెన్త్ (10th) పాసై ఉండాలి.
దీనితో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ (ITI), డిప్లొమా లేదా బి.టెక్ (B.Tech) వంటి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
రైల్వే శాఖ అత్యంత పారదర్శకంగా ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది. అభ్యర్థులు ఈ దశలను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT). ఇది ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల రూపంలో ఉంటుంది. తర్వాత.. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT). ఇది లోకో పైలట్ ఉద్యోగాలకు చాలా కీలకం.
చివరగా.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.. దీని తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. లోకో పైలట్ బాధ్యతల దృష్ట్యా అభ్యర్థులు కంటి చూపుతో సహా నిర్దేశిత వైద్య ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న బోర్డుల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో సికింద్రాబాద్ (Secunderabad) రీజియన్ కూడా ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గొప్ప అవకాశం. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్కతా, ప్రయాగ్రాజ్ వంటి ప్రధాన నగరాల్లోని రీజియన్లలో కూడా నియామకాలు జరుగుతాయి.