NTV Telugu Site icon

IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఔట్!

Team India

Team India

Rohit Sharma and Virat Kohli Might Skip Sri Lanka ODIs: భారత్ ప్రస్తుతం జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఆపై శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జులై 27 నుంచి ఆరంభం కానుండగా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆగష్టు 2 నుంచి మొదలవనుంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముగ్గురు స్టార్ ప్లేయర్స్ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

రోహిత్‌ శర్మ 2023 డిసెంబరు నుంచి ఆరు నెలలుగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు. విరాట్ కోహ్లీ మధ్యలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నా.. ఆపై ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆడాడు. రోహిత్, కోహ్లీలు ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. లంకతో వన్డే సిరీస్‌ అనంతరం బంగ్లాదేశ్‌తో భారత్‌ రెండు టెస్టులు ఆడుతుంది. ఆ సిరీస్‌కు ఈ ఇద్దరు అందుబాటులోకి రానున్నారు.

Also Read: PV Sindhu: మరోసారి పతాకధారిగా పీవీ సింధు!

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ అనంతరం న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు భారత్ ఆడనుంది. ఇక ఈ ఏడాది చివర్లో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023-2025 ఫైనల్ లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లు రోహిత్ సేనకు కీలకం కానున్నాయి. రోహిత్ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యాలలో ఒకరు శ్రీలంక వన్డే సిరీస్‌లో జట్టును నడిపించే అవకాశముంది.