బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. మొదటి రోజు బౌలింగ్తో అదరగొట్టిన భారత్.. రెండో రోజు బ్యాటింగ్లోనూ జోరు చూపించింది. దీంతో మొదటి టెస్టులో విజయం దిశగా సాగుతోంది. ఓవర్నైట్ స్కోరు 77/1తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 321 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (120) అద్భుత సెంచరీతో అదరగొట్టగా. . జడేజా (66 నాటౌట్), అక్షర్ పటేల్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేసి శతకం వైపు దూసుకెళ్తున్నారు. దీంతో ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో 144 రన్స్ లీడ్ సాధించింది టీమిండియా.
పట్టుదలగా బ్యాటింగ్
ఆసీస్ బ్యాటర్లు తడబడ్డ పిచ్పై భారత బ్యాటర్లు దుమ్మురేపారు. మొదట కెప్టెన్ రోహిత్ ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూనే అవసరమైన సమయంలో సంయమనం పాటిస్తూ బ్యాటింగ్ కొనసాగించాడు. ఓ ఎండ్లో అశ్విన్ (23), కోహ్లీ (12), పూజారా (7), సూర్యకుమార్ (8) ఇలా వరుస వికెట్లు పడుతున్నా తాను మాత్రం గొప్పగా పోరాడాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే కెప్టెన్గా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్గా రికార్డులకెక్కాడు. అనంతరం ఇతడికి బౌలింగ్లో అదరగొట్టిన జడేజా తోడయ్యాడు. ఇతడు కూడా ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. రోహిత్ ఔటయ్యాక.. జడేజాతో కలిసిన అక్షర్ పటేల్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 321 రన్స్ చేసింది. జడేజా (66 నాటౌట్), అక్షర్ (52 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Also Read: Kethireddy Pedda Reddy: ఇసుక రీచ్ వద్ద జేసీ ఆందోళన.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్